ద్విచక్రవాహనదారులకు హెల్మెట్ తప్పనిసరిగా అమలు చేసే నిమిత్తం ఏపీ పోలీసులు కఠిన చర్యలు చేపట్టనున్నారు. హెల్మెట్ ధరించిన వారికే బంకుల్లో పెట్రోల్ విక్రయించేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మరో రెండు రోజుల్లో హెల్మెట్ నిబంధనలు అమలు చేస్తామని, హెల్మెట్ ధరించని వారికి జరిమానాలు విధిస్తామని, భవిష్యత్ లో తనిఖీలు మరింత పెంచుతామని హెచ్చరించారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్లు ధరించకపోతే కఠిన చర్యలు తప్పవని, తల్లిదండ్రులు తమ పిల్లలకు అధిక సామర్థ్యం గల ద్విచక్రవాహనాలను ఇవ్వొద్దని, పిల్లలు హెల్మెట్లు ధరించేలా చూసే బాధ్యత వారి తల్లిదండ్రులదేనని ఈ సందర్భంగా గౌతం సవాంగ్ సూచించారు.