చట్టాలు చేస్తే మార్పు రాదు...వాటిని కఠినంగా అమలు చేస్తేనే ఆ చట్టాల అసలు ఉద్దేశం నెరవేరుతుంది. ఏపీలో కరోనా పరీక్ష ఆర్టీపీసీఆర్ రేటుకు సంబంధించి జగన్ సర్కార్ ఇటీవలె ముఖ్యమైన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఐసీఎంఆర్ గుర్తింపు కలిగిన ఎన్ఏబీఎల్ ప్రైవేటు ల్యాబ్లలో ఆర్టీపీసీఆర్ ధరను రూ.350గా నిర్ణయించింది. ఆస్పత్రులు, ల్యాబ్లలో కచ్చితంగా సవరించిన రేట్లను ప్రదర్శించాలని ఆదేశించింది. జిల్లా వైద్యాధికారులు సవరించిన రేట్లకే పరీక్షలు జరిగేలా నిరంతరం పర్యవేక్షించాలని సూచించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం పంపే శాంపిళ్ల టెస్టుకు రూ.475, అలాగే ఎన్ఏబీఎల్ ల్యాబ్లలో రూ.499 వసూలుచేస్తున్నారు. ఇప్పుడు దానిని రూ.350గా నిర్ణయించారు. అయితే కృష్ణా జిల్లాలో కొన్ని ల్యాబ్లో కరోనా టెస్టులు రూ.499 తీసుకుంటున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ జె నివాస్ వెంటనే చర్యలు ప్రారంభించారు. జిల్లాలోని ప్రైవేట్ ల్యాబ్లు కరోనా నిర్ధారణ పరీక్షలు 350 రూపాయలకే చేయాలని ఆదేశాలు చేశారు. వసూలు చేస్తున్న రుసుము మొత్తాన్ని కూడా ప్రదర్శించాలని చెప్పారు. ఎక్కడైనా ఎక్కువ రుసుము వసూలు చేస్తే తన దృష్టికి తీసుకు రావాలని సూచించారు. ఎక్కువ వసూలు చేస్తున్న ల్యాబ్లపై హాస్పిటల్ క్లినికల్ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు. అధిక ధరలు వస్తున్న ట్యాబ్లను అధికారులు పరిశీలించడంతో.. వెంటనే రేట్లు మారుస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు.