-రేణిగుంట విమానాశ్రయంలో ఘనస్వాగతం
-వెంకన్న దర్శనానికి కుటుంబ సభ్యులతో సహా కేసిఆర్ రాక
-స్వాగతం పలికిన మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తదితరులు
-రేణిగుంట నుండి నేరుగా తిరుమల చేరుకున్న కేసీఆర్ దంపతులు
-ఆలయంలో స్వాగతం పలికిన టిటిడి ఇఓ సాంబశివరావు తదితరులు
-శ్రీవారికి ఆభరణాలు సమర్పించిన సీఎం చంద్రశేఖరరావు
-తెలంగాణ తరపున శ్రీవారికి మొక్కులు చెల్లించనున్న కేసిఆర్
తిరుపతి, సూర్య ప్రత్యేక ప్రతినిధి: రెండు రోజుల తిరుమల తిరుపతి పర్యటన కోసం ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్రావు సతీ సమేతంగా కుటుంబ సభ్యులతో సహా మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, డిఐజి ప్రభాకర్రావు, తుడా మాజీ చైర్మన్ శంకర్రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. విమానా శ్రయం ఎదుట బ్రాహ్మణులు వేద మంత్రోచ్ఛారణలతో స్వాగ తించారు. కెసిఆర్ అభిమానుల పేరిట వందలాది మంది విమానాశ్రయానికి చేరుకుని స్వాగతం పలికారు. రేణిగుంట నుండి నేరుగా తిరుమల చేరుకున్న కేసీఆర్ దంపతులు టిటిడి ఇఓ సాంబశివరావు, జేఇఓ శ్రీనివాసరాజు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం శ్రీవారికి ఆభర ణాలు సమర్పించలేదని, స్వతంత్ర భారత చరిత్రలో కేసీఆర్ కొత్త సాంప్రదాయానికి నాంది పలికారని ఇఓ సాంబశివరావు అన్నారు. శ్రీకృష్ణ దేవరాయలు, మైసూర్ మహారాజు వంటి వారు మాత్రమే గతంలో శ్రీవారికి ఆభరణాలు సమర్పించారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తరపున శ్రీవారికి మొక్కులు చెల్లించడంతో కొత్త అధ్యాయం ప్రారంభయిందన్నారు. కేసీఆర్ బస చేసిన అతిథి గృహానికి వచ్చి రాజంపేట ఎంపి మిథున్రెడ్డి, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్రెడ్డిలు స్వాగతం పలికారు. అతిథి గృహం వద్ద పెద్ద ఎత్తున తిరుమల భక్తులు గుమికూడి కేసీఆర్ను ఆసక్తిగా చూశారు. చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు నాయకులు, అధికారులు, ప్రముఖులు కూడా కేసీఆర్ను కలిశారు. కేసీఆర్తో పాటు అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు హరీష్రావు, ఈటల రాజేందర్, ఇంద్రకరణ్రెడ్డి, పోచారం శ్రీనివాస్రెడ్డి, పద్మారావు, ఎంపి కవిత, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్రెడ్డి, గ్యాదరి కిశోర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు రాజీవ్శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్, దేవాదాయ శాఖ కార్యదర్శి శివశంకర్ తదితరులు కేసీఆర్ వెంట ఉన్నారు.