రాజ్యసభలో సస్పెన్షన్ కు గురైన 12 మంది ఎంపీలకు మద్దతుగా కాంగ్రెస్ లోక్ సభ సభ్యుడు శశిథరూర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సంసద్ టీవీ షోల నుంచి ఆయన తప్పుకొన్నారు. ఈ మేరకు థరూర్ ట్విటర్ ద్వారా తన నిర్ణయాన్ని ప్రకటించారు. సంసద్ టీవీలో ప్రసారమవుతున్న టు ది పాయింట్ అనే చర్చా వేదికకు థరూర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఎంపీల సస్పెన్షన్ నేపథ్యంలో ఈ షో నుంచి తప్పుకొంటున్నట్లు థరూర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఎంపీలపై వేటు ఎత్తివేసే వరకూ ఈ షోకు హోస్ట్ గా వ్యవహరించబోనని స్పష్టం చేశారు. అంతకుముందు శివసేన ఎంపీ ప్రియాంక ఛతుర్వేది కూడా సంసద్ టీవీ యాంకర్ గా తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. గత వర్షాకాల సమావేశాల్లో సభలో అనుచితంగా, హింసాత్మక ధోరణితో ప్రవర్తించిన 12 మంది ఎంపీలను క్రమశిక్షణా చర్యల కింద రాజ్యసభ ఛైర్మన్ సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన ఎంపీల్లో కాంగ్రెస్ కు చెందిన సభ్యులు ఆరుగురు ఉండగా, శివసేన, తృణమూల్ కాంగ్రెస్ నుంచి చెరో ఇద్దరు, సీపీఐ, సీపీఎం నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు