వివాహమంటే భారీ ఖర్చు తప్పదు. అయితే వివాహ వేడుకల ఖర్చు భరించలేని పేదవారు ఎందరో ఉన్నారు. ఇటువంటి 300 మంది యువతులకు సామూహిక వివాహ వేడుక నిర్వహించి పీపీ సవానీ గ్రూప్ అధినేత మహేశ్ సవానీ మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు . గుజరాత్ లో జరిగిన ఈ సామూహిక వివాహ వేడుకలో 300 జంటలు ఒక్కటయ్యాయి. వేద మంత్రాల సాక్షిగా సాంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వివాహ వేడుక అందరి దృష్టిని ఆకర్షించింది. మహేశ్ సవానీ చొరవతో నవ దంపతులు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. 2008లో తొలిసారిగా ప్రారంభించిన ఈ సామూహిక వివాహ వేడుక నేటికీ కొనసాగుతోంది. సవానీ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 4 వేలకు పైగా జంటలు ఒక్కటయ్యాయని పీపీ సవానీ సంస్థ అధికారి ఒకరు తెలిపారు. కరోనా భయాల కారణంగా ఈ వివాహా వేడుకకు పరిమిత సంఖ్యలో అతిథులను ఆహ్వానించారు. గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వీ, గుజరాత్ భాజపా అధ్యక్షుడు సీఆర్ పాటిల్ హాజరయ్యారు. 4000 మందికి పైగా ఆడపిల్లలకు పెంపుడు తండ్రిగా మారి కన్యాదానం జరిపించినందుకు గర్వపడుతున్నానని మహేశ్ సవానీ తెలిపారు.