భారత్ లో 'ఒమిక్రాన్' టెన్షన్ మొదలైంది. ఆఫ్రికా దేశాల నుంచి ఇటీవల భారత్ కు వచ్చిన వారిలో చాలా మంది ఆచూకీ దొరకడం లేదు. పాస్పోర్టుల్లో పేర్కొన్న అడ్రస్ లో వారు ఉండకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. వీరి ద్వారా కొత్త వేరియంట్ స్థానికంగా వ్యాపించే ముప్పు ఉందని అధికారులు టెన్షన్ పడుతున్నారు.
ఆఫ్రికా దేశాల నుంచి గత 15 రోజుల్లో సుమారు 1000 మంది ముంబైకి చేరుకున్నారు. వీరిలో 466 మందిని గుర్తించామని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. ఆఫ్రికా దేశాల నుంచి ఇటీవల బిహార్ కు 281 మంది వచ్చారని తెలిపారు. వారిలో సుమారు 100 మంది కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో విదేశీ ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించేందుకు 4 ఎయిర్ పోర్టుల్లో ఆరోగ్య సిబ్బందిని మోహరించినట్టు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. వీరికి క్వారంటైన్ ను తప్పనిసరి చేశారు. దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరు వచ్చి పాజిటివ్ గా తేలిన ఓ వ్యక్తికి ఏ వేరియంట్ సోకిందన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. జీనోమ్ విశ్లేషణ ఫలితాల కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.