చేయని నేరానికి ఓ వ్యక్తి 43 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. 18 ఏళ్ల వయసులో అరెస్ట్ అయిన ఆ వ్యక్తి 62 ఏళ్ల వయసులో జైలు నుంచి విడుదల అయ్యాడు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని మిసోరికి చెందిన కెవిన్ స్ట్రిక్లాండ్ అనే వ్యక్తి చేయని తప్పుకు జైలుశిక్ష అనుభవించాడు. 1978 ఏప్రిల్ 25న కాన్సాస్ లోని ఓ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ముగ్గురిని కాల్చి చంపారు. ఈ ఘటన నుంచి తప్పించుకున్న సింతియా డగ్లస్ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాల్పులు జరిపిన వారిలో కెవిన్ ఉన్నాడని భావించి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అతని పేరును పేర్కొన్నారు.
తర్వాత తాను పొరబడినట్లు డగ్లస్ కి తెలిసింది. కానీ తప్పు చేసినట్లు ఒప్పుకుంటే కోర్టు తనకు శిక్ష విధిస్తుందేమోనన్న భయంతో పోలీసులకు ఆ విషయం చెప్పలేదు. దీంతో కెవిన్ కు కోర్టు 50 ఏళ్ల శిక్షను ఖరారు చేసింది. దశాబ్దాలు గడిచాక ఈ ఏడాది ఆగస్టులో కెవిన్ శిక్షను సవాల్ చేస్తూ స్థానిక ప్రాసిక్యూటర్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణలో కెవిన్ నిర్దోషి అని కోర్టు తేల్చింది. ఈనెల 23న అతడిని జైలు నుంచి విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కెవిన్కు ఆర్థిక సాయం అందించేందుకు ‘గో ఫండ్ మీ’ సంస్థ రూ. 10 కోట్లు విరాళంగా సేకరించింది.