ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేవరగట్టు కర్రల సమరంల... పక్కా ప్రణాళిక కారణమని నిర్ధారణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 21, 2021, 04:06 PM

కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల సమరంలో కొందరి తలలు పగలడానికి ఉద్దేశపూర్వకంగా దాడి చేయడమే కారణమని పోలీసులు నిర్ధారించారు. కర్రల సమరంలో పాల్గొన్న ఎల్లార్తి గ్రామానికి చెందిన 14 మంది నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఉద్దేశపూర్వకంగా కర్రలతో దాడి చేస్తున్నట్లు సిసి కెమెరాలలో వీడియోలలో గుర్తించారు. కాగా, దసరా రోజు కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రల సమరం కామన్‌. సంప్రదాయంగా వస్తున్న ఈ వ్యవహారంలో ఇప్పుడు కొత్త, కొత్త కోణాలు బయటపడుతున్నాయి.


కర్రల సమరం టైమ్‌లో కొందరు దుండగులు.. ఉద్దేశపూర్వకంగా కొందరిపై దాడి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా వారిని గుర్తించిన పోలీసులు..వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పాత పగలతో కొందరు గిట్టనివారిపై దాడి చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే రంగంలోకి దిగిన వారు దాడికి కారణమైనవారిని గుర్తించేపనిలో ఉన్నారు. కర్రల సమరం చరిత్రలో ఇంత వరకు ఇలాంటి ఘటనలు జరగలేదని స్థానికులు అంటున్నారు. ఇందుకు కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.


ఇక్కడి సంప్రదాయం ప్రకారం ప్రతి ఏటా కర్రల సమరం జరుగుతుంటుంది. అక్కడ కర్రలు కర్రలు కొట్టుకుంటాయి. అగ్గి బరాటాలు ఒక్కసారిగా భగ్గుమంటాయి. తలలు టెంకాయల్లా పగిలిపోతాయి. కళ్లల్లో భక్తి, కర్రల్లో పౌరుషం. ప్రతి ఒక్కరిలో ఒళ్లు విరుచుకునే వీరావేశం. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా దేవరగట్టులో కర్రలు కరాళ నృత్యం చేశాయి. ఎప్పటిలాగే దేవరగట్టులో వందల మంది తలలు పుచ్చకాయల్లా పగిలిపోయాయి. మనుషుల రక్తంతో మాలమల్లేశ్వరస్వామికి రక్తతర్పణ జరిగిపోయింది.


శంభో శివ శంభో అంటూ భక్తులు ఊగిపోయారు. మాల మల్లేశ్వరస్వామిని దక్కించుకునేందుకు లక్షలాది మంది కర్రలతో పోటీపడ్డారు. ఎలాగైనా అడ్డుకోవాలనే లక్ష్యంతో వచ్చిన వేల మంది పోలీసులు కేవలం చూస్తూ ఉండిపోయారంతే. రెండు వేల మంది పోలీసులు, నిఘా కెమెరాలు, డ్రోన్లు, బారికేడ్లు, చెక్‌పోస్టులు.. అయినా ఇవేమీ దేవరగట్టు యుద్ధాన్ని ఆపలేకపోయాయి. సుమారు 12 గ్రామాల ప్రజలు ఒళ్లు గగుర్పొడిచేలా కర్రలతో కొట్టేసుకున్నారు. కాని ఇక్కడే కాచుకుని కూర్చున్న ఓ బృందం కక్ష తీర్చుకుంది. కొందరు వ్యక్తులను టార్గెట్ చేసి దాడి చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు దాడి చేసినవారిపై కేసులు నమోదయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com