విజయవాడ: నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలతో జగన్ తన నేర ప్రవృత్తిని బయటపెట్టుకున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై జగన్ బాధ్యత మరిచి మాట్లాడారని.. ఓ వ్యక్తిని కాల్చి చంపండని బహిరంగ సభలో చెప్పడం చట్టరీత్యా నేరమని అన్నారు. ఎన్నికల సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మూడేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉందన్నారు.
జగన్ లాంటి ప్రతిపక్ష నేతను గతంలో ఎప్పుడూ ఎక్కడా చూడలేదని మంత్రి అన్నారు. ఓటమి భయంతోనే జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. హింసను ప్రేరేపించే జగన్కు ప్రతిక్ష నేతగా ఉండే అర్హత లేదన్నారు. జగన్ వ్యాఖ్యలను ఎన్నికల సంఘం సుమోటోగా స్వీకరించి అతడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. జగన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని.. చంద్రబాబుకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.