త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్పై గురువారం సాయంత్రం హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటి వరకూ ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. గురువారం సాయంత్రం అగర్తాలాలోని శ్యామ్ప్రసాద్ ముఖర్జీ లేన్లోని తన అధికారిక నివాసం వద్ద విప్లవ్ కుమార్ ఈవినింగ్ వాక్ చేస్తుండగా.. గుర్తు తెలియని ముగ్గురు దుండగులు కారులో వచ్చి సీఎంను ఢీకొట్టేందుకు యత్నించారు. దీనిని గమనించిన ముఖ్యమంత్రి.. అప్రమత్తమై ప్రమాదం నుంచి బయటపడేందుకు పక్కకు దూకేశారు. సీఎం సెక్యూరిటీలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. ఆ దుండగులను పట్టుకునేందుకు సెక్యూరిటీ సిబ్బంది యత్నించారు. అయితే నిందితులు అక్కడ నుంచి తప్పించుకుని పారిపోయారు. అదే రోజు రాత్రి ఆ ముగ్గురిని కీర్చోముహని ఏరియాలో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఉదయం ముగ్గురు నిందితులను కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బిద్యుత్ సూత్రధార్ మాట్లాడుతూ.. సీఎం విప్లవ్ దేవ్పై హత్యయాత్నానికి ప్రయత్నించిన ముగ్గురూ యువకులేనని, వారి వయసు 25 నుంచి 30 ఏళ్లలోపు ఉంటుందన్నారు. వారిని రెండు రోజుల పోలీసుల కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరామని, అయితే, న్యాయస్థానం మాత్రం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించిదన్నారు. వీరిని పోలీసులు జైళ్లోనే విచారించనున్నారు. ముఖ్యమంత్రి భద్రతా వలయంలో వాహనం నడపం వెనుక వారి ఉద్దేశం ఏంటనేది దర్యాప్తులో తేలుతుందని తెలిపారు.