ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. ఆసీస్ జట్టు త్వరలో బంగ్లాదేశ్లో పర్యటించి 5 టీ20 మ్యాచ్ల సిరీస్ ఆడనున్నది. కీలకమైన టీ20 వరల్డ్ కప్ ముందు ఇరు జట్లు ఈ సీరీస్లో తలపడనున్నాయి. ఈ ఐదు మ్యాచ్లలో ఆసీస్కు కెప్టెన్గా మాథ్యూ వేడ్ వ్యవహరిస్తాడని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన సమయంలో పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ అనారోగ్యం సమస్యలతో ఇంటికి తిరిగి వచ్చేశాడు. అతడి మోకాలుకు మైనర్ సర్జరీ ఉండటంతో వెస్టిండీస్, బంగ్లాదేశ్ పర్యటనలకు దూరమయ్యాడు. టీ20 వరల్డ్ కప్ కోసం అందుబాటులో ఉండటానికే అతడు ఈ రెండు సిరీస్ల నుంచి తప్పుకున్నాడు. మరోవైపు రెగ్యులర్ వైస్ కెప్టెన్ పాట్ కమిన్స్తో పాటు సీనియర్ క్రికెటర్లు అందుబాటులో లేకపోవడంతో వెస్టిండీస్తో జరిగిన వన్డే మ్యాచ్లకు అలెక్స్ కేరీకి కెప్టెన్సీ పగ్గాలు ఇచ్చారు. అయితే టీ20 వరల్డ్ కప్ దగ్గర పడుతుండటంతో.. బంగ్లాదేశ్ పర్యటనకు మాత్రం టీ20 కెప్టెన్గా మాథ్యూ వేడ్ను కెప్టెన్గా నియమించారు.
గత ఏడాది భారత జట్టు ఆసీస్లో పర్యటించిన సమయంలో తొలి సారిగా వేడ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ఆస్ట్రేలియా టీ20 జట్టుకు 11వ కెప్టెన్గా వేడ్ సేవలు అందించాడు. అయితే ఫించ్ రావడంతో తిరిగి అతడినే కెప్టెన్ చేశారు. తాజాగా వేడ్కు కెప్టెన్సీ ఇచ్చినా.. అలెక్స్ కేరీ మాత్రం స్పెషలిస్టు బ్యాట్స్మాన్గా బంగ్లాలో పర్యటించే జట్టులో ఉంటాడు. ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్లో విక్టోరియా, టాస్మానియా, హోబార్ట్ హరికేన్స్ జట్లకు కెప్టెన్గా పని చేసిన అనుభవం వేడ్కు ఉన్నది.