ఇండిపెండెన్స్ డే వేడుకల సందర్భంగా పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలు దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నట్లు నిఘా వర్గాల హెచ్చరించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో భద్రతా సంస్థలు అలర్ట్ అయ్యాయి. డ్రోన్ల దాడులకు పాల్పడే అవకాశం ఉండటంతో ముఖ్యమైన కట్టడాలు, ప్రాంతాలలో భద్రతను కట్టుదిట్టం చేశాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు విఘాతం కలిగించేందుకు నగరంలోని పలు కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రమూకలు దాడులకు పాల్పడొచ్చని భద్రతా సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఇంటెలిజెన్స్ విభాగం సహా నగరంలోని పోలీస్ స్టేషన్లను ఢిల్లీ పోలీస్ కమిషనర్ బాలాజీ శ్రీవాస్తవ అప్రమత్తం చేశారు. డ్రోన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు పోలీసులు, భద్రతా దళాలకు తొలిసారిగా శిక్షణ ఇస్తున్నారు.