ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన... పీఎం కిసాన్ స్కీమ్. రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అద్భుతమైన పథకం ఇది. ఈ స్కీమ్ ద్వారా ఏటా మూడు విడతల్లో రూ.2,000 చొప్పున మొత్తం రూ.6,000 రైతుల అకౌంట్లలో జమ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఆదాయపు పన్ను చెల్లిస్తున్న రైతులు పీఎం కిసాన్ పథకానికి అర్హులు కాదు. అయితే ఆదాయపు పన్ను చెల్లిస్తున్న రైతుల అకౌంట్లలో కూడా పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు జమ అయ్యాయి. 42 లక్షలకు పైగా రైతుల అకౌంట్లలో రూ.3,000 కోట్ల వరకు జమ అయింది. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. 42.16 లక్షల రైతులు అనర్హులని గుర్తించింది. వారి నుంచి రూ.2,992 కోట్లు వెనక్కి తీసుకుంటున్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పార్లమెంట్కు తెలిపారు. అనర్హులైన రైతుల లెక్కలు చూస్తే అస్సాం-8.35 లక్షలు, తమిళనాడు 7.22 లక్షలు, పంజాబ్ 5.62 లక్షలు, మహారాష్ట్ర-4.45 లక్షలు, ఉత్తరప్రదేశ్ 2.65 లక్షలు, గుజరాత్ 2.36 లక్షల మందికి పీఎం కిసాన్ డబ్బులు జమ అయినట్టు తేలింది. అస్సాం రైతుల నుంచి రూ.554 కోట్లు, పంజాబ్ రైతుల నుంచి రూ.437 కోట్లు, మహారాష్ట్ర రైతుల నుంచి రూ.358 కోట్లు, తమిళనాడు రైతుల నుంచి రూ.340 కోట్లు, ఉత్తరప్రదేశ్ రైతుల నుంచి రూ.258 కోట్లు, గుజరాత్ రైతుల నుంచి రూ.220 కోట్లు వెనక్కి తీసుకోవాల్సి ఉంది.