అమరావతి : సేద్యం చేస్తున్నవారెందరో, కౌలుకు తీసుకుని సేద్యం చేస్తున్న వారెందరో గణాంకాలు సేకరించి మదింప చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. సచివాలయంలోని తన కార్యాలయంలో ఆయన బ్యాంకర్లతో సమీక్ష నిర్వహించారు. తూర్పు, పశ్చిమ గోదావరి,, కృష్ణా, గుంటూరు జిల్లాలలో కౌలు రైతులు అధికంగా ఉన్నారని వీరి గణాంకాలను బ్యాంకర్ల తమ నెట్ వర్క్ ద్వారా సేకరించి వారి స్థితిగతులపై అధ్యయనం చేయాలని కోరారు. లక్ష రూపాయల రుణాలపై ఎటువంటి ఆంక్షలు విధించవద్దని, సరళంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయదారులకు ఇది చాలా కీలకమైన సమయమని వారికి రుణాలివ్వటంలో కఠినంగా ఉండవద్దని కోరారు. భూ యజమానులు, కౌలు రైతుల వివరాలు తనకు సమర్పించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.రుణాలిచ్చే విధానాన్ని సరళీకరించాలని, ఏ ప్రాతిపదికన ఇవ్వాలో తగిన మార్గదర్శకాలు రూపొందించాలని కారారు. వ్యవసాయం లాభసాటిగా మారాలన్నది తమ ప్రభుత్వ విధానమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వ్యవసాయం ఉపాధిని కల్పించేదిగా, ఆదాయాన్ని పెంపొందించేదిగా ఉండాలని అన్నారు. బ్యాంకులతో అనుసంధానమైన సంక్షేమ కార్యక్రమాల వివరాలను అధికారులు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కౌలు రైతులు ఎందరున్నారో జిల్లాల వారీగా గణాంకాలు సేకరించాలని ముఖ్యమంత్రి కోరారు. చిన్న సన్నకారు రైతులు నష్టపోకూడదని, వారికి సీజను ముగియకముందే సకాలంలో రుణాలు అందించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.