దేశంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నవేళ కేంద్రం ప్రభుత్వం రాష్ట్రాలకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా 8 రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు లేఖ రాసింది కేంద్ర సర్కార్. ఒక వైపు పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇంతకాలం మూత వ్యాపార, వాణిజ్య సంస్థలు తెరుకోవడంతో స్తంభించిన జన జీవనం ఇప్పుడిప్పుడే గాడిలోపడుతోంది. అయితే, కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పరిస్థితి భిన్నంగా ఉంది. దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల్లో కరోనా కేసుల నమోదు చూస్తుంటే ఆందోళనకరంగానే ఉంది. ఈక్రమంలో కేంద్ర ప్రభుత్వం అయా రాష్ట్రాలకు లేఖలు రాసింది. కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని సూచనలు చేసింది. ప్రతీ రాష్టంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని..కరోనా నిబంధనల్ని పాటించేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే కఠిన ఆంక్షలు అమలు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ పలు రాష్ట్రాల అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ లేఖలు రాసారు. అరుణాచల్ ప్రదేశ్, అసోం, మణిపూర్, కేరళ, మేఘాలయ, ఒడిశా, త్రిపుర, సిక్కిం రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేఖలు రాసింది. ఈ రాష్ట్రాలను కరోనా కట్టడికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కోరింది.