కుటుంబ భవిష్యత్ అవసరాల కోసం బీమా అనేది చాలా ముఖ్యం. అయితే బీమా ప్రియమం ఖరీదైన అంశం కావడంతో చాలా మంది ఇన్సూరెన్సు కట్టుకోవడానికి సుముఖంగా ఉండరు. అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం తక్కువ ప్రీమియంతో మంచి బెనిఫిట్ ఇచ్చే స్కీమ్ ను అమలు చేస్తోంది.
అదే 'ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన'. ఈ స్కీమ్ లో సంవత్సరానికి కేవలం 12 రూపాయల ప్రీమియం చెల్లించడం ద్వారా రూ.2 లక్షల వరకు బీమా పొందవచ్చు. ఈ పాలసీ ఇతర వాటితో పోలిస్తే చాలా చౌక అయినది కావడంతో బలహీన వర్గాల ప్రజలతో పాటు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ పథకాన్ని 2015 లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. పీఎం సురక్ష బీమా యోజన పథకంలో చేరడానికి 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు. పాలసీ తీసుకున్నవారు ప్రమాదంలో మరణిస్తే అతని నామినీకి రెండు లక్షల రూపాయలు అందుతాయి. అదే ప్రమాదంలో పాక్షికంగా గాయాలు ఏర్పడితే రూ.లక్ష, పూర్తిగా డిసేబుల్ అయితే పూర్తి రెండు లక్షలు అందిస్తారు.
ఈ స్కీమ్ లో చేరాలనుకునే వారికి బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు. యాక్టీవ్ గా ఉండే బ్యాంక్ ఖాతా కలిగిన బ్రాంచ్ లో చిన్న అప్లికేషన్ సమర్పించడం ద్వారా ఈ స్కీమ్ లో చేరిపోవచ్చు. ఆధార్ కార్డును బ్యాంక్ తో లింక్ చేసి ఉంచుకోవాలి. అలాగే బ్యాంక్ ఖాతా పాస్బుక్, వయస్సు ధృవీకరణ పత్రం మరియు ఆదాయ ధృవీకరణ పత్రం యొక్క ఫోటోకాపీని తయారు చేసి పాస్పోర్ట్ సైజు ఫోటోతో జత చేస్తూ బ్రాంచ్ లో దరఖాస్తు చేసుకోవాలి.
ప్రతి సంవత్సరం ఆటో డెబిట్ అవకాశం కూడా ఎంచుకోవచ్చు. దీని ద్వారా ప్రీమియం తేదీన మన ఖాతా నుంచి ఆటోమేటిక్ గా డబ్బు కట్ అవుతుంది. ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలకు https://jansuraksha.gov.in/Forms-PMSBY.aspx వెబ్ సైట్ ను సందర్శించండి.