చిలకలూరిపేటలో శ్మశానంలో కరోనా రోగుల శవాలను దహనం చేయడానికి రూ. 15వేలు నుండి రూ. 25 వేలు వరకు వసూలు చేస్తున్నారని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం అన్నారు. శ్మశానంలో జరుగుతున్న ఈ వ్యవహారంపై బాధితులు రావు సుబ్రహ్మణ్యంకు ఫిర్యాదు చేయడంతో మంగళవారం ఉదయం లయన్స్ క్లబ్ స్వాధీనం లో ఉన్న పాత మార్కెట్ యార్డ్ ప్రక్కన ఉన్న స్మశానవాటికలో పని చేస్తున్న భాను అనే వ్యక్తి తో రావు సుబ్రహ్మణ్యం ఫోన్ చేసి మాట్లాడారు. మా మామ గారు కరోనా తో చనిపోయారని దహన కార్యక్రమం చేయాలని ఎంత అవుతుంది అని అడగ్గా రూ. 15 వేలు దహనం చేసేందుకు, రూ. 4200 లయన్స్ క్లబ్ కు ఇవ్వాలని, అంబులెన్స్ కు సేపరేట్ గా మాట్లాడుతామని డబ్బులు డిమాండ్ చేయగా అంత ఇవ్వలేమని వేరే శ్మశానానికి తీసుకుని వెళతామని చెప్పగా అక్కడయితే రూ. 20వేలు లేక రూ. 25వేలు చెల్లించాలి అని భాను సమాధానం చెప్పడంతో తరువాత మాట్లాడుతామని రావు సుబ్రహ్మణ్యం ఫోన్ పెట్టివేశారు.
తరువాత భాను ఫోన్ చేసి 10వేలు నుండి 6 వేలుకు దిగివచ్చాడు. ఈ సందర్భంగా రావు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ... చిలకలూరిపేట లో అధికార పార్టీ నేత కుటుంబ సభ్యుడు చనిపోతే వారినుండి కూడా ముక్కుపిండి రూ. 15 వేలు వసూలు చేశారన్నారు. ఉచితంగా ఖననం చేయాల్సిన ప్రభుత్వ అధికారులు స్మశాన మాఫియా కు ఎందుకు వత్తాసు పలుకుతున్నారో ముఖ్యమంత్రి జగన్ ఆలోచించాలన్నారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని, తహసీల్దార్, మునిసిపల్ ఛైర్మన్, మునిసిపల్ కమీషనర్ కు తెలియకుండా ఈ మాఫియా వేళ్లూనుకుని ఉంటే వెంటనే స్పందించి ఉచితంగా దహన సంస్కారాలు జరిగేలా చర్యలు చేపట్టి తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. లేనిపక్షంలో నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా లు చేయాలని రావు సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు.
కోవిడ్ ఆసుపత్రిలో తనిఖీలు చేసిన అధికారులు ఏమి చర్యలు తీసుకున్నారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. రెండు డోసులు ఉచితంగా వేసి మిగతా డోసులు ఆసుపత్రిలో ఏజెంట్ల ద్వారా అమ్ముకుంటోన్న విషయాన్ని ఎందుకు అరికట్టేందుకు ముందుకు రావడం లేదని జగన్ సర్కార్ ను ప్రశ్నించారు. వ్యాక్సిన్ ప్రయివేటు ఆసుపత్రికి తరలించి అధిక ధరలు వసూలు చేస్తున్న మాఫియా ను అరికట్టాలని రావు సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. ఆక్సిజన్ మాఫియా కు పాల్పడుతున్న వారిపై, కరోనా స్మశాన రాబందులు పై కఠిన చర్యలు తీసుకోవాలని లేకుంటే కరోనా మృతదేహలతో ప్రభుత్వ కార్యాలయాలు ముందు ప్రజలతో కలిసి నవతరం పార్టీ ధర్నాలు నిర్వహించాల్సి వస్తుందని రావు సుబ్రహ్మణ్యం ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు. ఈ మేరకు ఆయన చిలకలూరిపేట స్మశాన ఉద్యోగితో మాట్లాడిన ఆడియో క్లిప్ ను మీడియా కు విడుదల చేసారు.