ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టోల్ ప్లాజాల వద్ద వీవీఐపీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లేన్లను రద్దు చేయాలని నిర్ణయించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు ట్రాఫిక్ లో చిక్కుకోకుండా ఉండేందుకు ఈ ప్రత్యేక లేన్లను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, వ్యవస్థలో వేళ్లూనుకున్న వీఐపీ కల్చర్ ను పక్కన పెట్టాలనే యోచనలో ఉన్న యోగి సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. వీవీఐపీ లేన్ల వల్ల సమానత్వం దెబ్బతింటోందని, వెంటనే వీటిని తీసివేయాలని జిల్లా కలెక్టర్లకు యూపీ అడిషనల్ చీఫ్ సెక్రటరీ సదాకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు.