కర్ణాటకలో ఎండా కాలంతో సంబంధం లేకుండా పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఆ రాష్ట్రంలో వెలుగు చూసిన రాసలీల సీడీ కేసు పూటకో ట్విస్ట్ తీసుకుంటోంది. ఇందులో బాధితురాలిగా చెబుతున్న యువతి తాజాగా కోర్టు మెట్లు ఎక్కుతోంది. ఆమె బెంగళూరు ఎయిర్పోర్టుకు చేరింది. అక్కడి నుంచి తన లాయర్లతో కలిసి... కోర్టుకు వెళ్తోంది. మేజిస్ట్రేట్ ముందు ఆమె తన వాంగ్మూలం ఇవ్వబోతున్నట్లు సమాచారం. కాగా ఇప్పటి వరుకు 5 సీడీలను రిలీజ్ చేసిన ఆ యువతి పలు సంచలన ఆరోపణలు చేసింది.
ఈ వ్యవహారం యడ్యూరప్ప సర్కార్ ను తీవ్ర ఇరకాటంలో పెట్టింది. ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత రమేష్ జార్కిహోళి ఇప్పటికే రాజీనామా చేశారు. అయితే ఈ అంశాన్ని రాజకీయంగా తమకు మంచి మైలేజ్ ఇస్తుందని భావించిన కాంగ్రెస్ కు సైతం చిక్కులు తప్పడం లేదు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ పేరు కూడా తెరపైకి వచ్చింది. దీంతో ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ కు అంశం పెను సవాలుగా మారింది. కోర్టులో ఆ యువతి ఏం వాగ్మూలం ఇస్తుందనేది సర్వత్రా హాట్ టాపిక్ అయింది.