బీజింగ్: అనుకున్నట్లే చైనా యుద్ధం కోసం సిద్ధమవుతున్నది. ఇప్పటికే టిబెట్లో భారీగా బలగాలు, మిలిటరీ సామగ్రి, వాహనాలను చైనా మోహరించింది. ఓవైపు ఇండియాతో సిక్కిం సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలోనే జూన్ నెల చివర్లో అక్కడికి సైన్యాన్ని తరలించినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. రోడ్డు, రైల్వే మార్గాల ద్వారా వేల టన్నుల మిలిటరీ సామగ్రిని టిబెట్కు తరలించారు. ఇప్పటికే చైనీస్ మీడియా యుద్ధానికి సంబంధించి భారత్కు ఎన్నో హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ వివాదం ఇలాగే కొనసాగితే.. అనివార్య పరిస్థితుల్లో యుద్ధానికి కూడా చైనా సన్నద్ధమవుతున్నది. ఇలా సైన్యాన్ని మోహరించడం ద్వారా ఇండియాపై ఒత్తిడి పెంచి.. చర్చలకు తలొగ్గేలా చేయాలని కమ్యూనిస్ట్ దేశం భావిస్తున్నది. ఓవైపు సిక్కిం సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలోనే అటు అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో చైనా మిలిటరీ డ్రిల్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోలను కూడా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ విడుదల చేసింది.