అమరావతి: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించడం కోసం ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎమ్డీసీ) అత్యాధునిక అంబులెన్స్లు ఏర్పాటుచేసింది. ఆరోగ్య రథం పేరుతో ఏర్పాటుచేసిన ఈ అంబులెన్స్లను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం సచివాలయంలో ప్రారంభించారు. ఒక్కోటీ రూ.45లక్షల వ్యయంతో ఏర్పాటుచేసిన రెండు అంబులెన్స్లోని సౌకర్యాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. కార్పోరేట్ సామాజిక బాధ్యత కింద ఏపీఎండీసీ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సీఎం అభినందించారు. రాష్ట్రంలో వ్యాధులు ఎక్కువగా ప్రబలుతున్న ప్రాంతాల్లో వీటిని వినియోగించాలని సూచించారు. రాష్ట్ర గనుల శాఖ మంత్రి సుజయకృష్ణ రంగరావు, స్వచ్ఛాంద్ర కార్పోరేషన్ ఛైర్మన్ సీఎల్ వెంకట్రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వాహనంలో సాధారణ రోగులకు మందులివ్వడంతో పాటు కేన్సర్ నిర్ధారణ సహా 200 రకాల పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంది.