తమిళనాడు రైతులకు అక్కడి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వ్యవసాయ రుణాలు తీసుకున్న 16 లక్షల మంది రైతులకు సుమారు 12 వేల కోట్లు మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సహకార బ్యాంకుల నుంచి తీసుకున్న సుమారు రూ.12,110 కోట్ల రైతు రుణాలను మాఫీ చేయనున్నట్లు సీఎం పళనిస్వామి తెలిపారు. కరోనా వేళ రైతులకు పంట నష్టం జరిగిందన్నారు. వరుసగా రెండు తుఫాన్లు, అకాల వర్షాల కారణంగా భారీ పంట నష్టం జరిగిందన్నారు. తక్షణమే రుణమాఫీ స్కీమ్ ను అమలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.