వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రైతాంగాన్ని పరామర్శించేందుకు వచ్చిన తనను వైసీపీ అడ్డుకోవడం సరికాదన్నారు. దాడికి ప్రతిదాడి కావాలంటే జనసేన కార్యకర్తలు రెడీగా ఉన్నారంటూ హెచ్చరించారు. దమ్ముంటే రైతులను పరామర్శించే నా పర్యటన అడ్డుకోండి అంటూ వైసీపీ కి పవన్ సవాల్ విసిరారు. ఈ సందర్భంగా పోలీసులపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కూడా పోలీస్ కుటుంబం నుండి వచ్చానని చెప్పుకొచ్చారు. అయితే కొంతమంది పోలీసులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అని ఆరోపించారు. వారు తీరు మార్చుకోకపోతే గుర్తుపెట్టుకుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్ వైసీపీ నాయకుల జాగీరు కాదన్నారు. నెల్లూరు జిల్లా అంటే తనకు ప్రత్యేక ఇష్టమన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటించే హక్కు తనకు ఉందన్నారు. ఎన్నికల్లో ఓడిపోయామని ఇంట్లో కూర్చోవడం తమకు చేతకాదన్నారు. వరదల్లో నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.