ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ కలిగిన రాజకీయ నేతగా సోషల్ మీడియాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరు వినిపిస్తోంది. ట్విటర్, గూగుల్ సెర్చ్, యూట్యూబ్ ప్లాట్ ఫామ్స్ లో అత్యధిక ట్రెండ్స్ ప్రధాని మోదీ పేరుపైననే ఉన్నాయి. ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు సోషల్ మీడియా టాప్ ట్రెండ్స్ ను ‘చెక్ బ్రాండ్స్’ సంస్థ నివేదిక రూపంలో వెల్లడించింది. ఈ మూడు నెలల్లో 95 మంది టాప్ పొలటికల్ లీడర్లు, 500 మంది అత్యున్నత ప్రభావశీలురకు సంబంధించిన ట్రెండ్స్ ను చెక్ బ్రాండ్స్ పరిశీలించింది. దాదాపు 10 కోట్ల ఆన్ లైన్ ఇంప్రెషన్స్ ఆధారంగా ఈ నివేదికను ప్రకటించింది. ఈ నివేదిక ప్రకారం.. 7.2 మిలియన్ 2,171 ట్రెండ్స్ తో మోదీ తొలి స్థానంలో నిలవగా.. మోదీకి అత్యంత సమీపంగా 2,137 ట్రెండ్స్ తో ఏపీ సీఎం జగన్ రెండో స్థానంలో ఉన్నారు. తదుపరి స్థానాల్లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ 3.5 మిలియన్ ఎంగేజ్ మెంట్ లతో ఉన్నారు. బ్రాండ్ స్కోర్ విషయంలోనూ 70 స్కోర్ తో మోదీ తొలి స్థానంలో ఉన్నారు. సోషల్ మీడియా వేదికలపై ఫాలోవర్స్, ట్రెండ్స్, సెంటిమెంట్స్, ఎంగేజ్ మెంట్, మెన్షన్స్.. ఆధారంగా బ్రాండ్ స్కోర్ను నిర్ధారిస్తారు. ఈ స్కోర్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా 36.43 స్కోర్తో రెండో స్థానంలో ఉన్నారు. ఆ తరువాత స్థానాల్లో, సోమవారం మరణించిన అస్సాం మాజీ సీఎం తరుణ్ గొగోయ్ (31.89), అరుణాచల్ సీఎం పెమా ఖండూ (31.89), యూపీ సీఎం ఆదిత్యనాథ్(27.03) ఉన్నారు.