ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓ అమ్మ కన్నీటి వ్యథ... పిల్లల చికిత్స కోసం అవయవాలు అమ్మకానికి

national |  Suryaa Desk  | Published : Wed, Sep 23, 2020, 08:03 PM

తల్లి తన బిడ్డలను నవమాసాలు మోసి, కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది. పిల్లల భవిష్యత్తు కోసం తన సర్వాన్ని త్యాగం చేయటానికి సిద్ధపడుతుంది. వారి కోసం ఎలాంటి బాధనైనా భరిస్తుంది. తన పిల్లల కంటే తనకు ఏదీ ముఖ్యమైనది కాదునుకుంటుంది. అలాంటి ఓ తల్లి హృదయ గాథ కన్నీళ్లు తెప్పిస్తోంది. కేరళలోని ఎర్నాకుళంలో ఓ తల్లి పిల్లల కోసం గుండెతో సహా తన అవయవాలన్నింటిని అమ్మకానికి పెట్టిందని 10 టీవీ కథనం పేర్కొంది. హస్పిటల్ బిల్లులను చెల్లించటం కోసం ఇలా చేసిందని తెలిపింది.

ఎర్నాకుళంలోని రోడ్డు పక్కన ఓ బోర్డుతో ఓ మహిళ కనిపించింది. కటిక పేదరికాన్ని అనుభవిస్తున్న ఆ తల్లి పేరు శాంతి. ఆమెకు ఐదుగురు పిల్లలు. కాయకష్టం చేసి డబ్బులు సంపాదించే ఆమె పెద్ద కొడుకు గతేడాది రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయాలపాలయ్యాడు. దీంతో అతనికి బ్రెయిన్ సర్జరీ చేశారు. రెండు కొడుకు పుట్టుకతోనే మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడు. ప‌ద‌కొండేళ్ల కూతురు కూడా రోడ్డు ప్ర‌మాదంతో న‌రాల వ్యాధి బారిన ప‌డింది. వీరంద‌రినీ పోషించేందుకు కుటుంబ బాధ్య‌త‌ను మోస్తున్న మూడో కొడుకు లాక్‌డౌన్ వల్ల ఉపాధి కోల్పోయాడు. తన చివరి బిడ్డ‌ ఇంకా స్కూలు విద్య‌న‌భ్య‌సిస్తోంది.

తమ పూట గడవటమే కష్టంగా ఉన్న కుటుంబంలో పిల్లల మందులకు డబ్బులు లేక చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంది. చివరికి ఆ తల్లి తన అభిమానాన్ని చంపుకుని చేయి చాచి సహాయం చేయమని అడిగిన ఒకరు కూడా సహాయం చేయలేదు. దీంతో ఈసారి ఆమె ఎవ‌రి సాయం కోరకూడదని, త‌న అవ‌యవాల‌ను అమ్మి అయినా స‌రే పిల్ల‌ల చికిత్స‌కు ఏ లోటూ రాకుండా చేయాలని, అప్పులు తీరిపోతాయని ఆ నిర్ణయం తీసుకుంది.

దాంతో ఓ బోర్డును ఏర్పాటు చేసి, దానిపై త‌న గుండెతో స‌హా అన్ని అవ‌య‌వాల‌ను అమ్మేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని తెలిపింది. వీటితో పాటు ఆమె బ్ల‌డ్‌గ్రూప్ వివ‌రాల‌ను ఆ బోర్డులో తెలిపింది. ఈ విషయం పై శాంతి మాట్లాడుతూ.. “నేను గ‌ర్భంతో ఉన్న‌ప్పుడు భ‌ర్త వ‌దిలేశాడు. త‌ర్వాత‌ డ్రైవింగ్ టీచ‌ర్‌గా ప‌ని చేశాను. కానీ అప్పుడు తన కూతురి ఆరోగ్యం బాగా లేకపోవటంతో ఆ పనిని వదిలేసినట్టు తెలిపింది. చాలా రోజులుగా అద్దె ఇంట్లోనే ఉంటున్నాం. ప‌రిస్థితులు మ‌రింత దిగ‌జారిపోవటంతో అద్దె కూడా చెల్లించ‌లేని దీనస్థితికి చేరుకున్నట్టు చెప్పింది. దానికి తోడు ముగ్గురు పిల్ల‌ల‌కు తీవ్ర‌మైన అనారోగ్య స‌మ‌స్య‌లున్నాయి. అందుకే తన అవ‌యవాల‌ను అమ్మి వారిని బాగు చేసేందుకు సిద్ధ‌మ‌య్యాను” అని పేర్కొంది.

ఈ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో అక్కడి ప్రభుత్వం స్పందించి, ఆమె కుటుంబానికి తాత్కాలిక నివాసాన్ని ఏర్పాటు చేసింది. వారి ఇంటి అద్దెను లయన్ క్లబ్ చెల్లించటానికి ముందుకొచ్చింది. కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ మాట్లాడుతూ, ఆ పిల్ల‌ల చికిత్స‌కు, మందులకు అవసరమయ్యే డబ్బులను ప్రభుత్వమే భర్తిస్తుందని ఆమెకు హామీని ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com