తెలుగుదేశం పార్టీకి ఉన్న యువ ఎమ్మెల్యేలు లో చాలా వరకు కీలకంగా చెప్పుకునేది ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు. అదే విధంగా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్. తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో ఏలూరి సాంబశివరావు నియోజకవర్గంలో విస్తృతంగా తిరగడమే కాకుండా పార్టీని ప్రజల్లోకి తీసుకుని వెళ్లే విధంగా చాలా కష్టపడ్డారు. రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఆయన మాత్రం నియోజకవర్గంలో ఎక్కడా కూడా వెనక్కి తగ్గిన పరిస్థితి లేదనే చెప్పాలి.
ఆయనపై విపక్షాలు అప్పట్లో ఎన్ని విమర్శలు చేసినా సరే నియోజకవర్గంలో మాత్రం తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయిలో తీసుకుని వెళ్లారు. ఆ క్రమంలోనే తెలుగుదేశం లో ఆయనకు మంచి ప్రాధాన్యత కూడా దక్కింది. 2019 ఎన్నికల్లో ఆయన కాస్త కష్టపడి విజయం సాధించారు. ఆ తర్వాత మాత్రం మీడియా ముందుకు ఆయన రాలేదు. పార్టీ మారతారని ప్రచారం జరిగిన సమయంలో మాత్రం తన నియోజకవర్గం పరిధిలో ఒక సమావేశం ఏర్పాటు చేసి తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. ఇక అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ విషయానికి వస్తే ఆయన కూడా మీడియా ముందు కనపడటం లేదు.
రాష్ట్ర ప్రభుత్వం ఆయనను చాలా వరకు ఇబ్బందులు పెడుతుంది. ఈ క్రమంలోనే పార్టీ మారే అవకాశం ఉందని వైసీపీ లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని లేకపోతే బిజెపిలోకి వెళ్లే సూచనలు ఉన్నాయని చాలా మంది వ్యాఖ్యలు చేశారు. కానీ అవన్నీ నిజం కాదని తెలిసింది. అయితే వీరిద్దరూ మాత్రం మీడియా ముందుకు అసలు రావడం లేదు. ప్రకాశం జిల్లాలో కరోనా కేసులు తీవ్రస్థాయిలో ఉన్నాసరే వీరిద్దరూ మాత్రం మీడియా ముందుకు వచ్చి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే డోల బాల వీరాంజనేయ స్వామి మాత్రం రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. నలుగురు ఎమ్మెల్యేలు ఉంటే అందులో ఇప్పటికే కరణం బలరాం పార్టీ మారారు. మరి వీరు ఎప్పుడూ మీడియా ముందుకు వస్తారో చూడాలి.