ఓవైపు అడవిలో భారీ వర్షం! మరోవైపు చిమ్మచీకటి! పిల్లలకు పుట్టెంటుకలు తీయించడానికి బంధువులతో కలసి బయలుదేరిన కుటుంబానికి ఏరులై పారుతున్న వర్షంతో ఎటు వెళ్లాలో తెలియలేదు. దాదాపు 30 మంది 35గంటలపాటు అడవిలో ఇరుక్కుపోయారు. ఆ వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా ఖాజీపేటలోని అగ్రహారానికి చెందిన ప్రశాంత్, లక్ష్మి దంపతులకు మూడేళ్ల కుమారుడు దేవాన్ష్, 11 నెలల కుమార్తె లాస్య ఉన్నారు. వారికి పుట్టెంటుకలు ఇచ్చేందుకు మైదుకూరు మండలంలోని నల్లమలలో ఉన్న భైరవకోనకు శనివారం అర్ధరాత్రి బయలుదేరివెళ్లారు. వీరితో పాటు దాదాపు 30 మంది బంధువులు రెండు ట్రాక్టర్లలో వెళ్లారు. అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షంతోపాటు చుట్టూ చిమ్మచీకటి కావడంతో అడవిలో దారి తప్పారు.
ఫోన్లో సిగ్నల్స్ లేక పోవడంతో ఎవ్వరికీ సమాచారం ఇవ్వలేకపోయారు. దీనికితోడు జంతువులు దాడి చేస్తాయని భయం పట్టుకుంది. దీంతో శబ్దాలు చేస్తూ ఆ రాత్రంతా గడిపారు. మరునాడు, ఆ మరుసటినాడు రాత్రి దాకా అలాగే అరుస్తూ తమలో తాము ధైర్యం చెప్పుకొంటూ గడిపారు. నీళ్లు, తిండి లేకపోవడంతో చివరకు కేకలు పెట్టే ఓపికా కోల్పోయారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం సిగ్నల్స్ రావడంతో 100కు ఫోన్చేశారు. దీంతో సమాచారం అందుకొన్న మైదుకూరు పోలీసులు.. స్థానికుల సహకారంతో బాధితులున్న ప్రాంతానికి రాత్రి9.30 గంటలకు చేరుకొని, వారిని రక్షించారు.