రోజు రోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. కొందరు కామాంధులు మానవ మృగాలుగా మారి మహిళలు..చిన్నారుల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే పాట్నాలో చోటు చేసుకుంది. ఆస్పత్రిలో తన తల్లికి సేవలు చేసేందుకు వచ్చిన కూతురుపై అదే ఆసుపత్రిలో పని చేస్తున్న సిబ్బంది అఘాయత్యానికి పాల్పడ్డారు. బాధిత యువతి తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. ఆమెకు సేవలు చేసేందుకు పేషెంట్ కుమార్తె అక్కడే ఉండాల్సి వచ్చింది. శనివారం అర్థరాత్రి సమయంలో ఆసుపత్రిలోని లాంజ్ లో యువతి నిద్రపోతుంది. అయితే దుప్పటిని ఎవరో లాగినట్లు అనిపించడంతో కళ్లు తెరిచి చూసే సరికి ఇద్దరూ ఆగంతకులు ఆమె నోరు మూశారు. మరో యువకుడు ఆమెను కాళ్లు చేతులు కట్టేసే ప్రయత్నం చేశాడు. దాంతో వారి బారి నుంచి రక్షించుకునేందుకు ఆ యువతి ప్రయత్నించింది. వారి చెర నుంచి తప్పించుకునేందుకు పోరాటం చేసింది. అంతేకాదు పక్కనే ఉన్న స్టీలు జగ్ తో కామాంధుడి మెుఖంపై దాడి చేసింది. మరో యువకుడిపై కూడా అలాగే దాడి చేసింది. దాంతో వారు కింద పడిపోయారు. పెద్దగా కేకలు వేస్తూ పరుగులు తీయడంతో అంతా బయటకు వచ్చారు. బాధితురాలిని అత్యాచారం చేయాలని ప్రయత్నించిన యువకులను బంధించి చితకబాదారు. అయితే నిందితులు అదే ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది అని తేలడంతో అంతా షాక్ తిన్నారు. అనంతరం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.