రెండు, మూడు, నాలుగు చక్రాల వాహనాలకు GSTని భారీ స్థాయిలో తగ్గించబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. ఫలితంగా కార్లు, బైకుల ధరలు అతి త్వరలో బాగా తగ్గనున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. కార్లు, బైకుల ధరలపై GST తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నట్లు జవదేకర్ తెలిపారు. అతి త్వరలోనే ద్విచక్ర, త్రిచక్ర, ఫోర్ వీలర్స్ ధరలు తగ్గబోతున్నట్లు ఆయన వివరించారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ధరలు కూడా తగ్గుతాయన్నారు. జీఎస్టీ తగ్గించమని ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రిని తాను కోరానన్నారు. త్వరలోనే జిఎస్టీ తగ్గుతుందన్నారు. లగ్జరీ కార్ల కేటగిరీలోకి బైకులు, మామూలు కార్లు రావు కాబట్టి...వాటిపై జీఎస్టీ తగ్గే ఛాన్సు ఉందన్నారు. ప్రస్తుతం కార్లు, బైకులపై GST...28 శాతం ఉంది. కొన్ని రోజుల కిందట... పారిశ్రామిక వేత్తలతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అయినప్పుడు... టూవీలర్లపై GST తగ్గించే అంశంపై GST కౌన్సిల్ చర్చిస్తుందన్నారు. కరోనా వల్ల కార్ల పరిశ్రమ నష్టాల్లోకి జారుకుంది. కార్ల కొనుగోళ్లు పెరగాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని జవదేకర్ కోరారు. కొన్ని వెసులుబాట్లు, పరిహారం ద్వారా ఆటో మొబైల్ ఇండస్ట్రీని కాపాడేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని తెలిపారు.