కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం పరిధిలోని సి.బెళగల్ మండలం సంగాల గ్రామంలో ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో ఓమహిళ ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు తలారి మద్దిలేటి, తలారి గోకారమ్మ (28) దంపతులు తమకున్న అరఎకర పొలంతో పాటు, మరో 2 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని పంటలు పండించుకుంటున్నారు.కాలం కలిసిరాకపోవడంతో పెట్టుబడులకు చేసిన అప్పులు పెరిగాయి. దానికి తోడు భర్త మద్యం తాగుడుకు అలవాటు పడ్డాడు. ఈ విషయాలపై నాలుగు రోజులుగా భార్యాభర్తల మధ్య వాదులాట జరిగింది. శుక్రవారం రాత్రి సైతం దీనిపై గొడవ పడ్డారు. తీవ్ర మనస్తాపం చెందిన గోకారమ్మ ఇంట్లో అందరు నిద్రించిన సమయంలో పురుగుల మందు తాగి అపస్మారకి స్థితిలో పడిపోయింది. శనివారం గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.చికిత్స పొందుతూ కోలుకోలేక అదే రోజు మధ్యాహ్నం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజకులాయప్ప తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం.