జూలై 7 నుంచి వారాంతాల్లో నడక మార్గాల్లో వచ్చే భక్తులకు జారీ చేసే దివ్యదర్శనం టోకెన్ల జారీ నిలిపివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవో శ్రీనివాసరాజు ప్రకటించారు. శుక్ర, శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ ఎక్కవ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. శ్రీవారి మెట్లు, అలిపిరి నడక మార్గాల్లో స్థాయికి మించి భక్తుల రాకతో ఈ నిర్ణయాన్ని వచ్చినట్లు తెలిపారు. సాధారణ భక్తులకు 10 నుంచి 18 గంటల సమయం పట్టే వేళ, దివ్యదర్శనం భక్తులు 2 నుంచి 6 గంటల వ్యవధిలోనే దర్శనం ముగించుకుని బయటకు వస్తారన్న సంగతి తెలిసిందే. ఇక దివ్యదర్శనానికి డిమాండ్ గణనీయంగా పెరుగుతుండగా, అలిపిరి, శ్రీవారి నడక మార్గాల్లో తిరుమలకు చేరుకుంటున్న భక్తుల సంఖ్య వేలల్లోకి చేరుకుంది. ముఖ్యంగా వారాంతాల్లో నడిచి వచ్చే వారి సంఖ్య 35 వేల వరకూ ఉంటుండటంతో 'దివ్యదర్శనం' టోకెన్ల జారీని నిలిపివేయాలని టీటీడీ నిర్ణయించింది. తొలి దశలో శుక్ర, శని, ఆది వారాల్లో టోకెన్ల జారీని నిలుపుతున్నామని జేఈఓ శ్రీనివాసరాజు వెల్లడించారు. జూలై 7 నుంచి ఈ నిర్ణయం అమలవుతుందని ఆయన అన్నారు. నడక మార్గాల్లో స్థాయికి మించి భక్తులు వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పట్లేదని తెలిపారు. కాగా, వారాంతాల్లో లక్ష నుంచి లక్షా 20 వేల మంది వరకూ నడక మార్గాల్లో తిరుమలకు చేరుకుంటూ ఉంటారు.