పిల్లల ఇంటర్నెట్ వాడకాన్ని కొందరు కేటుగాళ్లు ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. కరోనా వేళ వర్చువల్ కిడ్నాపింగ్ విధానంతో కష్టపడకుండా కాసులు సంపాదించేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. పిల్లలను నిజంగా కిడ్నాప్ చేయకుండా.. చేసినట్లు తల్లిదండ్రులను నమ్మిండి డబ్బులు లాగడమే వీరి కొత్త టెక్నిక్. దేశంలో నేరాలు బాగా జరిగే ముంబైలోనే ఇలాంటి నేరాలకు స్కెచ్ లు వేస్తుండగా.. ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ విషయంపై వారు లోతుగా వివరాలు సేకరించగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.ఈ విధానం ద్వారా.. హ్యాకర్లు మొదట ఇంట్లో పిల్లల ఫొటోలను ఇంటర్నెట్ ద్వారా సంపాదిస్తారు. ఆ తర్వాత పిల్లల వాయిస్ని రికార్డ్ చేస్తారు. ఈ తతంగమంతా ఆన్ లైన్ ద్వారానే పూర్తి చేస్తారు. తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్లాక... ఇళ్లలో ఒంటరిగా ఉంటున్న పిల్లలు ఫోన్లో ఆటలు ఆడుతుండగా అప్పుడు హ్యాకర్లు ప్రవేశిస్తారు. పిల్లలతో మాట్లాడుతూ వాళ్ల వాయిస్, ఫొటోలు, వీడియోలు సేకరిస్తారు. ఆ తర్వాత ఆ చిన్నారుల వద్ద ఉన్న ఫోన్ ఆగిపోయేలా హ్యాకర్ చేస్తాడు. వెంటనే తలిదండ్రుల వాట్సాప్కి వాళ్ల పిల్లల ఫొటోలను పంపిస్తారు. వారు ఆ ఫొటోలను చూడగానే మీ పిల్లలను కిడ్నాప్ చేశాం. వారు మా దగ్గరే ఉన్నారంటూ మెసేజ్ పెడతారు. ఏడుస్తున్నారంటూ చిన్నారి మిమిక్రీ ఏడుపు వాయిస్ పంపిస్తారు.అది విన్న పేరెంట్స్ ఆ గొంతు తమ పిల్లలదేనని గుర్తించి కంగారు పడతారు. పోలీసులకు చెబితే... పీక కోస్తామంటూ బెదిరింపులకు దిగుతారు. అప్పటికప్పుడు డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలంటూ డిమాండ్ చేస్తారు. లేదంటే మీ పిల్లలను చంపేస్తామని బెదిరిస్తారు. ఇదీ వర్చువల్ కిడ్నాపింగ్ నడుస్తున్న తీరు. అందుకే మీ పిల్లలు మొబైల్తో ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలని పోలీసులు సూచిస్తున్నారు. హ్యాకర్లతో, కొత్త వ్యక్తులతో ఆన్లైన్లో వాళ్లు మాట్లాడుతున్నారా? అన్న విషయాన్ని గమనిస్తూ ఉండాలంటున్నారు. లేకుంటే ఇలాంటి సమస్యలను తల్లిదండ్రులు ఎదుర్కొంటారని పోలీసులు చెబుతున్నారు.