అమ్మాయి పుట్టడం ఇష్టం లేదని తల్లి పొత్తిళ్లల్లోనే పసిగుడ్డును ఓ కసాయి తండ్రి చంపేశాడు. బిడ్డను చంపి పైశాచిక ఆనందం పొందాడు. ఈ విషాద ఘటన హిమాచల్ప్రదేశ్ మండి జిల్లాలోని నస్లోహ్ గ్రామంలో బుధవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. హరీష్ కుమార్, మీనాదేవీ(27కి ఎనిమిది సంవత్సరాల క్రితం పెళ్లి అయింది. ఇప్పటికే వీరికి ఇద్దరు సంతానం.. ఒక బాబు(7), ఒకమ్మాయి(4) ఉంది. హరీష్కు మగ పిల్లలు సంతానం కావాలని కోరడంతో.. ఆమె మూడోసారి గర్భం దాల్చింది. మూడో కాన్పులో కూడా ఆడబిడ్డ పుట్టేసరికి హరీష్కు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మీనాదేవీ బుధవారం ఉదయం పసిపాపకు జన్మనివ్వగా.. రాత్రి పసిగుడ్డును అతి దారుణంగా చంపేశాడు. మీనాదేవీతో హరీష్ గొడవ పడి.. ఆమెను దారుణంగా కొట్టాడు. బిడ్డను తలకిందులుగా చేసి.. నోట్లో వేలు పెట్టి ఊపిరాడకుండా ప్రాణాలు తీశాడు. ఆ తర్వాత బిడ్డను పూడ్చి పెట్టి రాక్షసానందం పొందాడు. పసిపాప తల్లి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.