ప్రైవసీ కారణాల వల్ల భారతదేశంలో నిషేధానికి గురైన చైనా యాప్స్ మరిన్ని చిక్కుల్లో పడుతున్నాయి. ప్రభుత్వం బ్యాన్ చేసిన 59 యాప్స్కు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ 79 ప్రశ్నలతో నోటీసులు జారీ చేసింది. ఆ ప్రశ్నలకు జూలై 22లోగా స్పందించాలని గడువు ఇచ్చింది. ఒకవేళ అప్పట్లోగా సమాధానం ఇవ్వకపోతే యాప్స్ని శాశ్వతంగా బ్యాన్ చేస్తామని భారత ప్రభుత్వం హెచ్చరించింది. ఇప్పటికే భారత ప్రభుత్వానికి చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, గ్లోబల్ సైబర్ నిపుణులు ఈ యాప్స్కు సంబంధించిన కార్యకలాపాలు, బ్యాక్గ్రౌండ్ లాంటి వివరాలను సేకరిస్తున్నారు. మరోవైపు చైనా యాప్స్కు నోటీసులు ఇచ్చిన ప్రభుత్వం సమాధానాల కోసం ఎదురుచూస్తోంది. కంపెనీల పుట్టుక, మాతృ సంస్థలు, నిధుల రాక, డేటా మేనేజ్మెంట్, కంపెనీ కార్యకలాపాలు, సర్వర్ల నిర్వహణ లాంటి అంశాలతో 79 ప్రశ్నలున్నాయి. అనధికారికంగా డేటా యాక్సెస్ చేయడం, సెక్యూరిటీ ఫీచర్లు, నిఘా కోసం డేటాను దుర్వినియోగం చేయడం లాంటి అంశాలపైనా ప్రశ్నలున్నాయి. భారత ప్రభుత్వం రూపొందించిన 79 ప్రశ్నలకు ఇచ్చే సమాధానాలపైనే ఆ యాప్స్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది.