వృద్ధుల ప్రాణాలతో ఆడుకుంటున్న నరహంతకుడు చంద్రబాబు అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విజయనగరంలోని ఓ ప్రైవేటు అతిథిగృహంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.... ఎన్నికల ప్రచారానికి వచ్చిన బాలకృష్ణ నిన్న చీపురుపల్లి, విజయనగరంలో మాట్లాడిన మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. కాగితాలు పట్టుకుని కిందపడీ మీదపడి చూసుకుని చదువుకుంటూ ప్రసంగించడాన్ని అందరూ చూశారు. సినిమాల్లో స్క్రిఫ్టు చదివినట్టుగానే రాజకీయ ప్రసంగాలనూ అదే విధంగా చదువుకుంటూ పోతున్నాడు. ఆయనకు జీవితం గురించి గానీ.. రాజకీయాలు, రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితులపై గానీ ఏమాత్రం అవగాహన లేదని నిన్నటి ప్రసంగంతో అందరికీ అర్ధమైంది. ఉత్తరాంధ్ర ప్రాంతం, విజయనగరం జిల్లా భౌగోళిక పరిస్థితులపై నీకేం అవగాహన ఉంది బాలకృష్ణ..? నీలాంటి సెలబ్రిటీలు వస్తుంటారు. పోతుంటారు. నీలాంటోళ్లు సినిమాల్లో చేశారు కనుక చూద్దామని వచ్చే జనం కొంత ఉర్రూతలూగారని.. నువ్వు కూడా ఊగిపోయి నోటికేదొస్తే అది మాట్లాడితే ఎలా కుదురుద్ది..? నీ మాటలు, నీ భాషను చూసి జనాలు నవ్వుకుంటున్నారు అది తెలుసుకో అని అన్నారు.