సాధారణంగా గబ్బిలాలను అరిష్టంగా భావిస్తాం..అవి కంటబడితే కీడు జరుగుతుందని భయపడతాం.. పొరపాటున గబ్బిలం ఇట్లోకి వస్తే శాంతి చేయిస్తాం.. కానీ ఆ ఊరి జనం మాత్రం గబ్బిలాలను దేవతలుగా భావిస్తారు..! భక్తితో పూజలు నిర్వహిస్తారు..! అంతేకాదు గ్రామంలోకి అడుగు పెట్టగానే స్వాగతం పలికేది కూడా ఈ గబ్బిలాలే..! ఇంతకీ ఎక్కడుందా ఊరు..? ఏమిటీ వింత ఆచారం..? ఎందుకు గబ్బిలాలను పూజిస్తున్నారు..?కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలో మాధవరంపోడు గ్రామం ఉంది. ఈ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఏ చెట్టును చూసినా గబ్బిలాలే దర్శనమిస్తాయి. అంతే కాదు ఈ గబ్బిలాలంటే ఈ ఊరి జనానికి ఎంతో భక్తి.. ఇక్కడి వారంతా గబ్బిలాలను దేవతా పక్షులుగా భావించి పూజలు చేస్తారు. ఒకప్పుడు గ్రామంలోని పెద్ద చెట్టుపై పదుల సంఖ్యలో వచ్చి చేరిన ఈ గబ్బిలాలు క్రమ క్రమంగా పెరిగి వందలాది సంఖ్యలో పెరిగాయి.పిల్లలకు జబ్బు చేస్తే గబ్బిలాలుండే చెట్టు దగ్గరకు తీసుకొచ్చి పూజలు నిర్వహిస్తారు. గబ్బిలాల ఎముకలను పిల్లలకి తాయత్తులుగా కడుతుంటారు. ఇలా చేయడం వల్ల పక్షి దోషం పోతుందని, రోగాలు అన్ని నయం అవుతాయని ఇక్కడి గ్రామస్థుల నమ్మకం.అలాగే గతంలో ఈ గ్రామానికి చెందిన వారు ఆర్థికపరమైన ఇబ్బందులతో సతమతమయ్యేవారు. గబ్బిలాలు గ్రామంలోకి వచ్చి చేరాక తామంతా ఆర్థికంగా బాగుపడ్డామని గ్రామస్థులు అంటున్నారు. గబ్బిలాలు వచ్చాకనే ఊర్లోని ముఠా కక్షలు తగ్గిపోయాయని స్థానికులు నమ్ముతున్నారు. నిజానికి కరోనా వైరస్ సైతం గబ్బిలాల ద్వారా వచ్చిందనే ప్రచారం ఉంది. కానీ ఈ ఊరి ప్రజలకు మాత్రం గబ్బిలాలు దేవతలు. వాటిని ఆరాధిస్తున్నారు. పైగా వందల సంఖ్యలో గబ్బిలాలు ఉండగా ఇప్పటివరకు ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని స్థానికులు చెబుతున్నారు.