ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంజాబ్ లో మ్యాచ్.. శ్రీలంకలో అన్నట్లు బిల్డప్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 05, 2020, 09:33 AM

అది పంజాబ్ రాజధాని చండీగఢ్‌కు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న సవారా గ్రామం.ఆ గ్రామంలోని స్టేడియంలో యువా టీ20 లీగ్ పేరుతో జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ కుర్రాళ్లు హోరాహోరీగా తలపడుతున్నారు. అయితే నిర్వాహకులు మాత్రం ఈ మ్యాచ్‌ను శ్రీలంకలోని బదుల్లాలో జరుగుతున్నట్లు నమ్మించారు. అంతేకాదు, ఆడుతున్నది కూడా శ్రీలంకకు చెందిన మొనరల హార్నెట్స్, వెల్లవాయ వైపర్స్ జట్లు అని కామెంటేటర్లు కూడా చెప్పుకొచ్చారు. సోషల్ మీడియా సైట్లలో చూస్తున్నవారు కూడా అదే నిజమని నమ్మారు. ఇంకా స్టేడియంలో అక్కడక్కడ శ్రీలంక ప్రముఖ మొబైల్‌ కంపెనీ డైలాగ్‌కు చెందిన బ్యానర్లను సైతం ఏర్పాటు చేశారు. అయితే, కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా మ్యాచ్‌లు నిలిచిపోతే ఈ మ్యాచ్ ఎలా జరిగిందని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. ఉవా క్రికెట్‌ లీగ్‌ మ్యాచ్‌ పేరుతో దీన్ని ఆన్‌లైన్‌లో సైతం ప్రసారం చేశారు. ఉవా ప్రీమియర్‌ టీ20 లీగ్‌ శ్రీలంకలోని దంబుల్లా నగరంలో జరిగే ఓ క్రికెట్‌ టోర్నీ. ఉవా ప్రావిన్స్‌ క్రికెట్‌ సంఘం కేంద్రమైన దంబుల్లా నగరంలో ఈ మ్యాచ్‌ జరుగుతున్నట్లు ప్రచారం చేసుకున్న నిర్వాహకులు ఆ మ్యాచ్‌ను ఆన్‌లైన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశారు.


ఆన్ లైన్ బెట్టింగ్ కోసమే..


ఈ మ్యాచ్‌పై ఓ పత్రికలో కథనం రావడంతో.. కరోనా వైరస్ నేపథ్యంలో ఒక మ్యాచ్‌ ఎలా నిర్వహించారంటూ వివరాలు సేకరిస్తే అసలు విషయం బయటపడింది. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ కోసమే ఇలాంటి మ్యాచ్‌ ఆడించినట్లు పోలీసు విచారణలో తేలింది. అయితే ఆడింది అంతా పంజాబ్‌ కుర్రాళ్లే కావడం మరో ట్విస్ట్. శ్రీలంకలో గుర్తింపు పొందిన క్లబ్‌ యువా పేరు వాడుకొని కొందరు తెలివిగా ఇలా చేసినట్లు తెలిసింది. లంక బోర్డు తమకు టోర్నీ నిర్వహణ కోసం అధికారికంగా అనుమతి కూడా ఇచ్చినట్లు చూపించడంతో ప్రత్యక్ష ప్రసారానికి 'ఫ్యాన్‌కోడ్‌' అనే సైట్‌ సైతం ముందుకు వచ్చింది.


ఇద్దరు అరెస్ట్..


ఈ మ్యాచ్‌కు సంబంధించి ప్రస్తుతానికి ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) గుర్తింపు పొందిన ఆటగాళ్లు ఈ టోర్నీలో పాల్గొనలేదు కాబట్టి తాము ఎలాంటి చర్య తీసుకోలేమని బీసీసీఐ స్పష్టం చేసింది. శ్రీలంక కూడా తమకు, ఈ టోర్నీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ప్రత్యక్ష ప్రసారం చేసిన ఫ్యాన్‌ కోడ్‌ మాతృసంస్థ డ్రీమ్‌ స్పోర్ట్స్‌. వారికి చెందిన బ్రాండ్, ఫాంటసీ స్పోర్ట్స్‌ ప్లాట్‌ఫామ్‌ 'డ్రీమ్‌ 11' ఐపీఎల్‌ స్పాన్సర్లలో ఒకటి. దీనికి ఎంఎస్ ధోనీ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు.


దర్యాప్తు చేస్తున్న పోలీసులు..


తమ క్రికెట్‌ సంఘం కొన్నేళ్లుగా యాక్టీవ్ గా లేకపోవడంతో దీన్ని అవకాశంగా తమ పేరును వాడుకున్నారని ఉవా ప్రావిన్స్‌ క్రికెట్‌ సంఘం ప్రతినిధి భగీరథ్‌ చెప్పారు. మరో వైపు మ్యాచ్‌పై పంజాబ్‌ పోలీసులు రంగంలోకి దిగారు. ఈ మ్యాచ్‌ గురించి తమకు ఆన్‌లైన్‌ ద్వారా ఫిర్యాదు అందిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. పంకజ్‌ జైన్‌, రాజు అనే ఇద్దరు వ్యక్తుల్ని అరెస్టు కూడా చేశామని డీఎస్పీ ఖరార్‌ పాల్‌ సింగ్‌ వెల్లడించారు. మరోవైపు ఈ మ్యాచ్‌ ఎవరు, ఎలా నిర్వహించారో ఆరా తీస్తున్నామని బీసీసీఐ అనినీతి నిరోధక యూనిట్‌ చీఫ్‌ అజిత్‌ సింగ్‌ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com