విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనలో ప్రభుత్వ అసమర్థత వల్లే ఇప్పుడు కూడా మరణాలు సంభవిస్తున్నాయని టీడీపీ నేత, మాజీమంత్రి నారా లోకేశ్ అన్నారు. గతంలో గొప్పకి పోయి బాధితులు కోలుకోకుండానే బలవంతంగా డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపారని ఆయన ఆరోపించారు. అందుకే ప్రమాదం జరిగిన 25 రోజుల తరువాత కూడా బాధితులు చనిపోతున్నారని విమర్శించారు. కనకరాజు మృతి ప్రభుత్వ హత్యే అని నారా లోకేశ్ ధ్వజమెత్తారు. సరైన వైద్యం అంది ఉంటే ఆయనకి ఈ పరిస్థితి వచ్చేది కాదని వ్యాఖ్యానించారు. బాధితులను గాలికి వదిలి కంపెనీ యాజమాన్యానికి జగన్ కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు.
ఎల్జీ పాలిమర్స్ గొప్ప కంపెనీ అని ప్రభుత్వం కితాబు ఇస్తుంటే ఎల్జీ పాలిమర్స్ సంస్థ నిర్లక్ష్యం వలనే స్టెరిన్ గ్యాస్ లీకైందని ఎన్జీటీ తేల్చిందని అన్నారు. ఇప్పటికైనా గ్యాస్ లీకేజ్ ప్రభావం ఉన్న గ్రామాల్లో అందించాల్సిన వైద్య సహాయం పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని నారా లోకేశ్ అన్నారు. గ్యాస్ ప్రభావంతో సుదీర్ఘ కాలం వచ్చే ఆరోగ్య సమస్యలను అంచనా వేసి సహాయ కార్యక్రమాలకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చెయ్యాలని సూచించారు. గ్యాస్ లీకేజ్కి కారణమైన కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.