కరోనా కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్న ముంబైకి మరో ముప్పు ముంచుకొస్తోంది. ముంబై మహానగరాన్ని ముంచెత్తేందుకు నిసర్గ తుఫాన్ దూసుకొస్తోంది. ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఆదివారం ఏర్పడిన అల్పపీడనం.. సోమవారం వాయుగుండంగా బలపడింది. మంగళవారం మధ్యాహ్నానికి అది తుఫాన్గా బలపడి తీరం వైపు కదులుతోంది. నిసర్గగా పిలుస్తున్న ఈ తుఫాన్.. ప్రస్తుతం గోవాలోని పాంజిమ్కు నైరుతి దిశగా 280 కి.మీ, ముంబయికి దక్షణ నైరుతి దిశగా 450 కి.మీ దూరంలో, గుజరాత్లోని సూరత్కు దక్షణ నైరుతి దిశలో 670 కి.మీ దూరంలో కేంద్రీకృతమైనట్టు మంగళవారం ఉదయం విడుదల చేసిన బులెటిన్లో వాతావరణవిభాగం పేర్కొంది. ఈ తుపాను జూన్ 3 మధ్యాహ్నానికి దక్షిణ గుజరాత్, ఉత్తర మహారాష్ట్ర తీరాలను దాటుతుందని తెలిపింది. డామన్, హరిహరేశ్వర్ (మహారాష్ట్ర) మధ్య తీరం దాటే అవకాశముందని తెలిపింది.
నిసర్గ తుఫాన్ ప్రభావం మహారాష్ట్ర, గుజరాత్పై ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ముంబైపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడే అవకాశముందని హెచ్చరించారు. ముంబైని చివరగా 2009 నవంబరులో ఫయాన్ తుఫాన్ తాకిందని ప్రముఖ వాతావరణ నిపుణుడు జాసన్ నికోలస్ తెలిపారు. అంతేకాదు 1891లో జూన్ నెలలో చివరిసారిగా ముంబైని తుఫాన్ ముంచెత్తిందని.. మళ్లీ 130 ఏళ్ల తర్వాత జూన్ నెలలో ముంబై తీరానాన్ని తుఫాన్ ముంచెత్తబోతోందని పేర్కొన్నారు.