ముంబయి: ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ తర్వాత అతిలోక సుందరి శ్రీదేవి నటించిన చిత్రం ‘మామ్’. ఈ సినిమా ట్రైలర్ను శనివారం విడుదల చేశారు. హత్య మిస్టరీగా తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రీదేవి పవర్ఫుల్ పాత్రలో కనిపించారు. కుమార్తెను కాపాడుకోవడానికి పోరాడే తల్లిగా ఆమె నటన ఆకట్టుకోనుంది.
‘మామ్’లో పాకిస్థాన్ నటులు సజల్ అలీ, అద్నాన్ సిద్దిఖీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి ఉద్యవర్ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. ఎ.ఆర్. రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. జులై 7న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.