ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓపెనర్ల పరీక్షలో ముగ్గురూ విఫలం!

national |  Suryaa Desk  | Published : Fri, Feb 14, 2020, 12:53 PM

న్యూజిలాండ్‌తో జరగనున్న తొలి టెస్టులో ఓపెనర్లుగా ఎవరిని బరిలోకి దించాలన్న ప్రశ్నకు ‘న్యూజిలాండ్‌ ఎలెవన్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌’ సమాధానం ఇస్తుందని టీమ్‌ఇండియా భావించింది. అయితే ప్రస్తుతం హామిల్టన్‌ వేదికగా జరుగుతున్న ఈ సన్నాహక మ్యాచ్‌లో ఓపెనర్ల రేసులో ఉన్న మయాంక్‌ అగర్వాల్‌, పృథ్వీ షా, శుభ్‌మన్‌ గిల్‌.. ముగ్గురూ విఫలమయ్యారు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన పృథ్వీ డకౌటవ్వగా, మయాంక్‌ ఒక్క పరుగుకే పరిమితమయ్యాడు. అనంతరం వన్‌డౌన్‌లో వచ్చిన గిల్ కూడా నిరాశపరిచాడు. ఖాతా తెరవకముందే పెవిలియన్‌కు చేరాడు. అయిదో స్థానంలో వచ్చిన రహానె (18) కూడా తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో భారత్‌ 38 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం 42 ఓవర్లకు భారత్‌ 103/4. పుజారా (40), హనుమ విహారి (29) క్రీజులో ఉన్నారు.  స్వదేశంలో ఓపెనర్లుగా రోహిత్, మయాంక్‌ భారీగా పరుగులు సాధించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు గాయంతో రోహిత్‌ సిరీస్‌కు దూరం కావడంతో మయాంక్‌కు జోడీగా మరో ఆటగాడిని ఎంపిక చేయాల్సి ఉంది. అయితే ఇటీవల మయాంక్‌ ఫామ్‌ కూడా గొప్పగా లేదు. ‘భారత్‌ ఎ’ జట్టు తరఫున అనధికారిక టెస్టు రెండు ఇన్నింగ్స్‌లోనూ డకౌటయ్యాడు. అంతేకాకుండా మూడు వన్డేల సిరీస్‌లోనూ విఫలమయ్యాడు. ఇప్పుడు తాజాగా సన్నాహక మ్యాచ్‌లోనూ ఒక్క పరుగే చేశాడు. మరోవైపు పృథ్వీ షా వన్డే సిరీస్‌లో ఫర్వాలేదనిపించినా భారీ స్కోరు సాధించేలేకపోయాడు. అయితే ‘భారత్‌-ఎ’ మ్యాచ్‌లలో గిల్‌ చెలరేగాడు. అనధికారిక తొలి టెస్టులో 83, 204*, రెండో టెస్టులో 136 స్కోర్లతో చెలరేగాడు. కానీ తాజా ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో గిల్ కూడా విఫలమవ్వడం టీమ్‌ఇండియాను కలవరపెడుతోంది. దీంతో ఫిబ్రవరి 21 నుంచి కివీస్‌తో జరగనున్న తొలి టెస్టులో ముగ్గురిలో ఎవరికి ఓపెనర్లుగా అవకాశం దక్కుతుందా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com