ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెయిల్ నిబంధనలను జగన్ అతిక్రమిస్తున్నాడా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 14, 2020, 12:54 PM

అక్రమాస్తుల కేసులో కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని వై ఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్​పై తెలంగాణ హైకోర్టులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అందులో కీలక అంశాలు ప్రస్తావించింది. పదవి, హోదాను సాకుగా చూపి జగన్ కోర్టు హాజరును తప్పించుకుంటున్నారని ధర్మాసనానికి సీబీఐ తెలిపింది. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన కేసు పరిస్థితులు మారిపోవు అంటూ సీబీఐ ఘాటు వ్యాఖ్యలు చేసింది. బెయిల్ షరతులను జగన్‌ అతిక్రమిస్తున్నారని సీబీఐ చెప్పింది. సీఎం అయ్యాక జగన్ ఒక్కసారే సీబీఐ కోర్టుకు వచ్చారని ఆక్షేపించింది. సహేతుక కారణం లేకుండానే మినహాయింపు కోసం జగన్ మళ్లీ పిటిషన్ వేశారని అభ్యంతరం తెలిపింది. చట్టం ముందు సీఎం అయినా సామాన్యులైనా ఒకటేనని సీబీఐ పేర్కొంది.
సీబీఐ, ఈడీ కలిపి వేసిన 16 చార్జిషీట్లలో జగన్‌ నిందితుడిగా ఉన్నారని, నిందితులుగా ఉన్న అధికారులు చాలా మంది జగన్ పాలనా పరిధిలో ఉన్నారని సీబీఐ కోర్టు దృష్టికి తెచ్చింది. బెయిల్ సమయంలో అంగీకరించిన షరతులకు జగన్ కట్టుబడి ఉండాలని సీబీఐ పేర్కొంది. జగన్‌ కేసుల్లో ఇంకా అభియోగాలు నమోదు కావల్సి ఉందని.. ఒక వేళ హాజరు మినహాయింపునిస్తే కావల్సింది చేసే స్వేచ్ఛ జగన్‌కు లభిస్తుందని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఆర్థికనేరాల్లో ప్రధాన నిందితుడు ఉన్న జగన్ చట్టానికి అతీతుడిగా నిలబడవచ్చా అని ప్రశ్నించింది. ప్రతిసారీ కేసుల నుంచి హాజరు తప్పించుకోవడానికి జగన్​ ఏదో ఒక సాకు చెబుతున్నారని సీబీఐ ఆక్షేపించింది. కోర్టుకు హాజరయ్యేందుకు తన కంపెనీల ప్రతినిధులుగా కిందిస్థాయి ఉద్యోగులను నియమించారని ఆరోపించింది. తన కంపెనీల ద్వారా క్విడ్‌ప్రొకో లబ్ధి పొందింది జగనే అని అభియోగం చేసింది. రాజకీయ, ధన బలాన్ని ఉపయోగించి జగన్ సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com