అమరావతిలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పాల్గొని అరెస్ట్ అయిన టీడీపీ నేత, ఎంపీ గల్లా జయదేవ్ కు మంగళగిరి మేజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన మేజిస్ట్రేట్ జనవరి 31 వరకు రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు గల్లా జయదేవ్ ని మంగళవారం(జనవరి 21,2020) తెల్లవారుజామున 4.30 గంటలకు గుంటూరు సబ్ జైలుకి తరలించారు. నిన్న(జనవరి 20,2020) ఉదయం పోలీసుల నిషేధాజ్ఞలను దాటుకుని అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి గల్లా జయదేవ్ వ్యూహాత్మకంగా చేరుకున్నారు. అక్కడ పోలీసులు జయదేవ్ ను అడ్డుకున్నారు.
ఈ క్రమంలో పోలీసులు, జయదేవ్ మధ్య పెనుగులాట జరిగింది. గల్లా జయదేవ్ చొక్కా సైతం చిరిగిపోయింది. ఆ తర్వాత జయదేవ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు దుగ్గిరాల, పెదకాకాని, గుంటూరు మీదుగా నరసరావుపేట.. అక్కడి నుంచి రొంపిచర్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు.రొంపిచర్ల పోలీస్ స్టేషన్ నుంచి గుంటూరు తీసుకొచ్చిన పోలీసులు.. అర్ధరాత్రి వరకూ పోలీసు వాహనంలోనే కూర్చోబెట్టారు. అర్ధరాత్రి 12.30 గంటలకు జీజీహెచ్ వైద్యులతో జయదేవ్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. తెల్లవారుజామున సబ్ జైలుకి తరలించారు.