కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో భూ సంస్కరణల విభాగం అధికారిణిగా పనిచేస్తున్న డి.ప్రశాంతి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ మహేశ్వరరాజు తెలిపిన వివరాల ప్రకారం... తాడేపల్లి మండలం ఉండవల్లి సెంటర్కు చెందిన ఎం.రామలింగేశ్వరరెడ్డి ఉయ్యూరు మండలం కాటూరు గ్రామ పరిధిలో 2015లో నాలుగు ఎకరాల 53 సెంట్ల వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. ఆ భూమికి పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చేందుకు ప్రశాంతి బాధిత రైతు నుంచి రూ.6 లక్షలు లంచం డిమాండ్ చేసింది. దీంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం కలెక్టరేట్లోని ఆమె విభాగంలో రైతు నుంచి రూ.3లక్షలు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన వివరించారు.