ఆంధ్రప్రదేశ్లో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం వివాదం తీవ్రరూపం దాలుస్తోంది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే, వాటిని సీఎం జగన్ తిప్పికొట్టారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఘాటుగా బదులిచ్చారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఏపీ ముఖ్యమంత్రికి ఇంగ్లీష్ మీడియం ఎలా అమలు చేయాలో సూచించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూనే.. ఇంగ్లీష్ మీడియం ఎలా అమలు చేయొచ్చో చెప్పారు.
"పిల్లలకు ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు చెప్పాలంటే మొదట టీచర్లకు ఆంగ్లంలో ట్రైనింగ్ ఇవ్వాలి. 90వేల మంది టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వకుండా, ప్రావీణ్యం లేకుండా ఒకేసారి మార్చేస్తానంటే ఎలా?. యునెస్కో, ఆక్స్ఫర్డ్ నివేదికల ప్రకారం.. ప్రాథమిక దశలో మాతృభాషలో బోధన అవసరం. ముందు టీచర్లను సిద్ధం చేయడం. ఆ తర్వాత ఓ చోట పైలెట్ ప్రాజెక్టు చేపట్టండి. ఆ తర్వాత మిగిలిన ప్రాంతంలో కూడా అమలు చేయండి." - పవన్ కళ్యాణ్
తెలుగు దండగ.. ఇంగ్లీష్ పండుగ అనే విధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని పవన్ అన్నారు. నాలుగు నెలలు ఇసుక లేకపోవడం వల్ల భవన నిర్మాణ కార్మికులు పడిన బాధలు వెంటనే తెలిశాయన్నారు. అదే, అనాలోచితంగా ఇంగ్లీష్ మీడియం రుద్దిదే.. విద్యార్థుల భవిష్యత్ మొత్తం దెబ్బతింటుందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు జగన్ ఉండరు.. ఈ 150 మంది ఎమ్మెల్యేలు కూడా ఉండదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.