టీటీడీ పాలక మండలిలో తనకు స్థానం కలిపించి తీరా ప్రమాణ స్వీకారం చేయముందే వేరొకరితో ప్రమాణం చేయించిన తీరుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని కేంద్ర సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ జాతీయ బోర్డు సభ్యుడు ప్రొఫెసర్ రాజేశ్ శర్మ చెప్పా రు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యదేవుని దర్శనానికి వచ్చిన ఆయన మీడియాలో మాట్లాడుతూ తనకు టీటీడీ బోర్డులో స్థానం కల్పించినట్లు, గత నెల3న ప్రమాణస్వీకారానికి హాజరు కావాలంటూ ఆహ్వాన సందేశం ప్రభుత్వం నుంచి అందిందని, తర్వాత రెండు రోజులకు తనకు బదులుగా ముంబైకి చెందిన పారిశ్రామికవేత్తకు చోటు కల్పించి ఆతనితో ప్రమాణ స్వీకారం చేయించారన్నారు. ఈ వ్యవహారంలో భారీ మొత్తంలో చేతులు మారాయని ఆయన ఆరోపించారు. ఇప్పటికే ఈ విషయంపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా, బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాలకు ఫిర్యాదు చేశానని, త్వరలో సుప్రీం కోర్టు తలుపు తడతానని చెప్పారు రాజేష్ శర్మ.