శరన్నవరాత్రుల్లో భాగంగా 8వ రోజైన ఆదివారం (ఆశ్వయుజ శుద్ధ అష్టమి) నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ శ్రీదుర్గాదేవిగా దర్శనమిస్తోంది. ఎనిమిదో రోజు అష్టమి నాడు భక్తులకు దుర్గాదేవిగా భక్తులకు సాక్షాత్కారిస్తున్నది జగదంబ. దుర్గముడనే రాక్షసుడిని సంహరించినందున దుర్గ అని పేరొచ్చింది. దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపంగా భక్తులు దుర్గాదేవిని కొలుస్తారు. ఎరుపు రంగు చీరలో త్రిశూలం చేతపట్టుకుని కోటి సూర్యప్రభలతో వెలుగొందే ఈ అమ్మవారిని ఎర్రటి పుష్పాలతో పూజిస్తే శత్రు బాధలు నశిస్తాయని భక్తుల నమ్మకం. ఈ రోజున అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గారెలు, కదంబం (కూరగాయలు, అన్నం కలిపి వండేది) బెల్లం, పాయసం నైవేద్యంగా సమర్పిస్తున్నారు. ఈ రోజున భక్తులు దుర్గాష్టమిగా కూడా జరుపుకుంటున్నారు.