ఒడిశాలోని గంజాం జిల్లా గోపపూర్లో సభ్యసమాజం తలదించుకునే ఘటన జరిగింది. గ్రామస్థులు మొత్తం వృద్దులు అని చూడకుండా కఠినంగా వ్యవహరించారు. చేతబడి నెపంతో ఆరుగురు వృద్ధుల పళ్లు పీకి వారితో అశుద్ధం తినిపించారు. గ్రామంలో రెండు వారాల వ్యవధిలో వివిధ కారణాలతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. గత నెల 28న మరికొందరు అస్వస్థతకు గురయ్యారు. చేతబడి కారణంగానే ఇలా జరుగుతోందని భావించిన గ్రామస్థులు స్థానికంగా నివసించే ఆరుగురు వృద్ధులను పట్టుకుని వారి పళ్లు పీకేశారు. వారితో అశుద్ధం తినిపించి వారిని ఓ భవనంలో బంధించారు.
సమాచారం అందుకున్న ఎస్పీ బుధవారం తన బృందంతో వెళ్తుండగా గ్రామస్థులు పోలీసులను ఆపడానికి పొలిమేర్లలో కళ్లలో కారం చల్లి అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు వారిని చెదరకొట్టి బలవంతంగా గ్రామంలోకి ప్రవేశించారు. 22 మంది మహిళలు సహా మొత్తం 29 మందిని అరెస్ట్ చేశారు. పోలీసులను చూసి సంబంధం ఉన్న పలువురు పురుషులు గ్రామం నుంచి పరారయ్యారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
చేతబడిని నమ్మి వృద్ధులను ఇలా హింసించడం కలకలం రేపుతోంది. అందరిని తలదించుకునేలా చేస్తుంది.