ఇప్పటికే దేశంలో కొత్త గా తీసుకువచ్చిన వాహన చట్టంతో జరిమానాల బాదుడు వాహనదారులను బెంబేలెత్తిస్తుంటే, వాహనం ఖరీదుకన్నా జరిమానా ఎక్కువకావటం పట్ట ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కొందరు వాహనాలను అక్కడే వదిలిపెట్టి పోతున్నారు. ఈ భారీ జరిమానాలపై ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్న నేపధ్యంలో కండోమ్ లేదని ఓ క్యాబ్ డ్రైవర్ కి జరిమానా విధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఢిల్లీకి చెందిన క్యాబ్ డ్రైవర్ ధర్మేంద్ర ను ఇటీవల ట్రాఫిక్ పోలీసులు ఆపి చెక్ చేసారు. అన్ని అనుమతులకు సంబంధించిన పత్రాలున్నా, క్యాబ్ లోని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో కండోమ్ లేదని చెప్పి జరిమానా వేశారు. దీంతో ఈ విషయాన్ని అతడు తన తోటి క్యాబ్ డ్రైవర్లు ఉన్న గ్రూపులో చలానాను ఫొటో తీసి షేర్ చేసి అందరూ కండోమ్ ప్యాకెట్లను క్యాబ్ లో పెట్టుకోవాలని, లేదంటే తనలాగే చలాను కట్టకతప్పదని హెచ్చరించాడు. ఇది దేశవ్యాప్తంగా వైరల్ కావటంతో పోలీసులు సర్ధి చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ విషయంపై ఢిల్లీ సర్వోదయ డ్రైవర్ అసోసియేట్ ప్రెసిడెంట్ స్పందిస్తూ, క్యాబ్ డ్రైవర్లు అంతా తప్పనిసరిగా తమ కార్లలో కండోమ్ ప్యాకేట్లను తీసుకెళ్లాలని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది కూడా ఇప్పుడు వైరల్ మరింత అయిపోయింది.
అయితే దీనిపై స్పందించిన ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు కొత్త వాహన చట్టంలో అసలు క్యాబ్ లో కండోమ్ ఉంచుకోవాలనే నిబంధన ఏదీ లేదని.. ఎందుకు చలానా విధించారనే విషయంపై పోలీసులను ఆరాతీస్తున్నామని తెలిపారు. క్యాబ్ లో కండోమ్ లేదని జరిమానా వేసిన పోలీసులపై ఫిర్యాదు చేస్తే వారిపై చర్య తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.