కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ స్మారకార్థం స్థానిక ఫిరోజ్ షా కోట్లా మైదానం పేరును అధికారికంగా అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంగా మార్చారు. ఢిల్లీ క్రికెట్ సంఘం (డీడీసీఏ) ఆధ్వర్యంలో గురువారం జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ఈ నూతన నామకరణ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రీడామంతి కిరణ్ రిజుజు, మాజీలు కపిల్ దేవ్, చేతన్ చౌహాన్, భారత క్రికెటర్లతోపాటు జైట్లీ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. డీడీసీఏ అధ్యక్షుడిగా 14 ఏళ్లపాటు బాధ్యతలు నిర్వర్తించిన అరుణ్ జైట్లీ అటు బీసీసీఐ ఉపాధ్యక్షుడిగానూ సేవలందించారు. ఇదే కార్యక్రమంలో స్టేడియంలోని ఓ స్టాండ్కు విరాట్ కోహ్లీ పేరును పెట్టారు. ఈనేపథ్యంలో అండర్-19 నుంచి భారత కెప్టెన్గా అతడి ప్రయాణాన్ని వీడియో ద్వారా ప్రదర్శించారు. ‘కోహ్లీ గౌరవార్థం ఓ స్టాండ్కు అతడి పేరు పెట్టే విషయాన్ని మొదట జైట్లీకే చెప్పా. ఇది మంచి నిర్ణయమని, ప్రపంచ క్రికెట్లో అతడిని మించిన ఆటగాడు లేడని ఆయన గుర్తుచేశారు’ అని డీడీసీఏ అధ్యక్షుడు రజత్ శర్మ తెలిపారు. డీడీసీఏ తీసుకున్న నిర్ణయంపై కోహ్లీ సంతోషం వ్యక్తం చేశాడు. ‘ఇంత అద్భుతంగా జరిగిన కార్యక్రమంలో నన్ను గౌరవిస్తారని ఊహించలేదు. రెండు దశాబ్దాల క్రితం జింబాబ్వేతో ఇక్కడ జరిగిన మ్యాచ్ కోసం నా కోచ్ రెండు టిక్కెట్లు ఇచ్చాడు. ఆ సమయంలో గ్యాలరీ చువ్వలను పట్టుకుని శ్రీనాథ్ ఆటోగ్రాఫ్ తీసుకోవడం నాకు బాగా గుర్తు. ఇప్పుడు అదే స్టేడియంలో నా పేరుతో ఓ పెవిలియన్ ఉండడం గౌరవంగా భావిస్తున్నాను. నా తండ్రి చనిపోయినప్పుడు జైట్లీ మా ఇంటికి వచ్చి నాకు ధైర్యాన్ని ఇచ్చారు’ అని కోహ్లీ తెలిపాడు.